తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. చంద్రబాబుకు నిజంగానే తెలంగాణపై ప్రేమ ఉంటే, రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వానికి అభ్యంతరం లేదని కేంద్రానికి, సీడబ్యూసీకి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. గోదావరి నదిపై నిర్మాణంలో ఉన్న సమ్మక్క సాగర్, సీతమ్మ సాగర్, వార్థ, కాళేశ్వరం మూడవ ప్రాజెక్టులతో పాటు, నల్గొండ జిల్లాలోని డిండి ఎత్తిపోతల, కల్వకుర్తి, పాలమూరు ప్రాజెక్టులకు నీటి కేటాయింపులపై అభ్యంతరాలు తొలగించాలని హరీశ్ రావు కోరారు.

మంగళవారం ఓ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ.. “నాకు రెండు రాష్ట్రాలు రెండు కళ్ల లాంటివి” అన్న వ్యాఖ్యలపై హరీశ్ రావు ఎద్దేవా చేస్తూ, “అది నిజమైతే నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఎండబెట్టి, కుడి కాలువ నిండుగా నీళ్లు తీసుకెళ్లడం సమంజసమేనా?” అని ప్రశ్నించారు. ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో నీటి కొరత వల్ల పంటలు ఎండిపోతున్నాయని, దీనికి చంద్రబాబు, రేవంత్ రెడ్డీలే కారణమని మండిపడ్డారు.
శ్రీశైలం, నాగార్జున సాగర్ కృష్ణా జలాల్లో ఏపీ 512 టీఎంసీల నీరు వాడుకోవాల్సి ఉండగా, 657 టీఎంసీలను వినియోగిస్తోందని, తెలంగాణకు రావాల్సిన 343 టీఎంసీలకు బదులుగా కేవలం 220 టీఎంసీలు మాత్రమే అందుతున్నాయని హరీశ్ రావు విమర్శించారు. చంద్రబాబు గతంలో కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు కేంద్రానికి లేఖ రాశారని గుర్తుచేశారు. 2018 జూన్ 13న ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు కాళేశ్వరానికి వ్యతిరేకంగా కేంద్రానికి లేఖ రాశారని, ప్రాజెక్టు అనుమతులు రద్దు చేయాలని కోరారని వెల్లడించారు.
చంద్రబాబు దత్తత తీసుకున్న జిల్లాల్లో పాలమూరు ప్రాజెక్టు, డిండి ఎత్తిపోతల, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలపై కూడా ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ లేఖ రాశారని హరీశ్ రావు ఆరోపించారు. గోదావరి బంకచర్ల ప్రాజెక్టుపై మాట్లాడుతూ, సముద్రంలో కలిసే నీటిని వాడుకుంటున్నామన్నది అసత్యమని, గోదావరి నీటిని పెన్నా నదికి తరలించేందుకు ఏపీ యత్నిస్తోందని ఆరోపించారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం తెలంగాణకు 968 టీఎంసీలు రావాల్సి ఉండగా, ఉమ్మడి రాష్ట్రంలో 200 టీఎంసీల నీరు కూడా లభించలేదని అన్నారు.
కాళేశ్వరం ద్వారా 240 టీఎంసీల నీటి హక్కు కేసీఆర్ సాధించారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో గోదావరి ప్రాజెక్టుల డీపీఆర్లు నిలిచిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు న్యాయం కావాలంటే, రాష్ట్ర ప్రాజెక్టులపై నో అబ్జెక్షన్ లెటర్ను కేంద్రానికి రాయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.