తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఐఏఎస్, ఐపీఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఏసీ గదుల్లో కూర్చొని పని చేయకుండా, పైరవీలతో సమయం గడిపే అధికారులపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఫీల్డ్ విజిట్లు చేయాలని పదేపదే సూచించినప్పటికీ, అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

“ఏసీ అనేది జబ్బేమో!” అంటూ సీఎం వ్యంగ్యంగా వ్యాఖ్యానించగా, ఇకపై కంఫర్ట్ జోన్లో ఉండే అధికారులకు కాకుండా, పనితీరు ఆధారంగా పోస్టింగ్లు ఇస్తామని స్పష్టంగా ప్రకటించారు. ముఖ్యంగా, ఎన్నికల నియమావళి ముగిసిన తర్వాత అధికారుల బదిలీలు భారీగా జరుగుతాయని సంకేతాలు ఇచ్చారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్న, పనితీరు తక్కువగా ఉన్న అధికారులను తొలగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
గతంలో కలెక్టర్ల సమావేశంలో ఫీల్డ్ విజిట్లు చేయాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అయితే, యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంతరావు తప్ప మిగతా కలెక్టర్లు ఆదేశాలను పాటించకపోవడంతో సీఎం ఆగ్రహానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో, ఫీల్డ్ విజిట్లు చేయని కలెక్టర్లపై కఠిన చర్యలు తీసుకునే యోచనలో ఉన్నారు.
పోలీసు అధికారుల విషయంలోనూ సీఎం ఫోకస్ పెట్టారు. ఇసుక దందాలు, పేకాట నిర్వాహణ వంటి అక్రమ కార్యకలాపాల్లో భాగస్వాములవుతున్న అధికారులను తొలగించేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇప్పుడు సీఎంవి వ్యాఖ్యలు అధికారులలో ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా పనిచేసే వారికి మాత్రమే గుర్తింపు ఉంటుందని సంకేతాలు అందడంతో పరిపాలనా వ్యవస్థలో మార్పులకు దారి తీసే అవకాశం ఉంది. పనితీరు, ఫీల్డ్ విజిట్లకు ప్రాధాన్యత ఇస్తూ సీఎం కొత్త పాలనా విధానం అమలు చేయాలని సంకల్పించారు.
ఇక ఈ మార్పులు ఎంతవరకు అమలు అవుతాయో వేచి చూడాలి!