యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, బాక్సాఫీస్ క్వీన్ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం తండేల్. ‘లవ్ స్టోరీ’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మరోసారి వీరి జోడీ ప్రేక్షకులను అలరించనుంది. ప్రముఖ దర్శకుడు చందూ మొండేటి మత్స్యకారుల నేపథ్యంలో కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.

పాన్ ఇండియా డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న చందూ మొండేటి తన తాజా చిత్రం తండేల్ ను బన్నీ వాస్, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే సినిమా ప్రమోషన్లో భాగంగా విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, గ్లింప్స్, ట్రైలర్ భారీ స్పందనను పొందాయి. ఫిబ్రవరి 07న సినిమా గ్రాండ్గా విడుదల కానుంది.
నాగచైతన్య తండేల్ రాజ్గా మత్స్యకారుడి పాత్రలో
ఈ చిత్రంలో అక్కినేని నాగచైతన్య తండేల్ రాజ్ అనే మత్స్యకారుడిగా నటిస్తున్నారు. మత్స్యకారుల జీవితాలను, వారికి ఎదురయ్యే కష్టసుఖాలను ఆవిష్కరించే ఈ సినిమా భారత జాలర్లు పొరపాటున పాకిస్థాన్ జలాల్లోకి వెళ్లడం, అక్కడ కోస్ట్ గార్డ్స్ అదుపులోకి తీసుకోవడం, జైలులో గడిపిన దుస్థితి వంటి ఘటనల ఆధారంగా రూపొందింది.
రియల్ తండేల్ రాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హాజరు
హైదరాబాద్లో జరిగిన తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు రియల్ తండేల్ రాజ్ (తండేల్ రామారావు) హాజరయ్యారు. తన కుటుంబంతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, సముద్రంలో వేటకు వెళ్లినప్పుడు ఎదురైన కొన్ని అనుభవాలను, పాకిస్తాన్ జైలులో గడిపిన కష్టాలను గుర్తుచేసుకున్నారు.
17 నెలల పాటు పాకిస్తాన్ జైలులో – తండేల్ రామారావు అనుభవాలు
“తండేల్ అంటే లీడర్ అని అర్థం. మిగతా జాలరులు తండేల్ను అనుసరిస్తారు. ఎన్ని ఎక్కువ చేపలు పడితే అంత పేరు వస్తుంది. వేటకు వెళ్లేముందు ఇదే నా చివరి ట్రిప్ అని భార్యకు చెప్పి వెళ్లాను. అప్పటికి ఆమె ఏడు నెలల గర్భిణి. 29 రోజులు వేట బాగానే సాగింది. అయితే వెనక్కి రావాలనుకున్నప్పుడు పొరపాటున పాకిస్థాన్ సముద్ర జలాల్లోకి వెళ్లిపోయాం. పాకిస్తాన్ కోస్ట్ గార్డ్స్ మాకు దొరికిపోయిన వెంటనే గుండె ఆగినంత పనైంది. జైలుకు తీసుకెళ్లినప్పుడు భయంతో ఏడ్చేశాం. అక్కడ 17 నెలల పాటు మగ్గిపోయాం. అయితే ధైర్యంగా పోరాడాం. కాబట్టే పాకిస్తాన్ జైలు నుంచి బయటపడి తిరిగి స్వదేశానికి వచ్చాం” అని తండేల్ రామారావు భావోద్వేగంతో గుర్తు చేసుకున్నారు.
తండేల్ సినిమా నిజ జీవిత కథ ఆధారంగా రూపొందిన ప్రాజెక్ట్ కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నాగచైతన్య, సాయి పల్లవి జోడీ మరోసారి విజయం సాధిస్తుందా అనే ఉత్కంఠతో అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరి 07న విడుదల కానున్న ఈ సినిమా మత్స్యకారుల జీవితాలను ఎంతవరకు ప్రభావితం చేస్తుందో చూడాలి!