రాజీవ్ యువ వికాసం పథకంలో సిబిల్ స్కోర్ కీలక ప్రమాణంగా మారింది. ప్రభుత్వ సహాయంతో లోన్ పొందాలనుకునే యువతకు క్రెడిట్ స్కోర్ను ప్రధాన అర్హతగా నిర్ణయించనున్నారు. దరఖాస్తుదారుల సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే లేదా గతంలో రుణాలు తీసుకుని చెల్లించకపోతే బ్యాంకులు వారి దరఖాస్తులను తిరస్కరించే అవకాశం ఉంది. అలాగే, లోన్ అప్లికేషన్కు ముందు బ్యాంకులు సిబిల్ స్కోర్ను తప్పనిసరిగా పరిశీలించనున్నాయి. దీనికి సంబంధించినగా రూ.100 నుంచి రూ.200 వరకు ఫీజును వసూలు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే కొన్ని బ్యాంకులు ఈ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాయి.

ఈ వసూలుపై ప్రభుత్వం స్పందించింది. తక్కువ ఆదాయ వర్గాలపై భారం పడకుండా చూసేందుకు బ్యాంకులు వసూలు చేసే స్కోర్ ఫీజును మినహాయించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇది ఎస్సీ సంక్షేమ శాఖ ద్వారా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు నివేదించనున్నారు. స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ (SLBC) సమావేశంలో ఈ అంశంపై చర్చించనున్నారు.
ఈ పథకానికి రాష్ట్రవ్యాప్తంగా భారీ స్పందన లభించింది. మొత్తం 16,25,441 దరఖాస్తులు అందగా, బీసీల నుంచి 5,35,666, ఎస్సీల నుంచి 2,95,908, ఎస్టీల నుంచి 1,39,112, ఈబీసీల నుంచి 23,269, మైనారిటీల నుంచి 1,07,681, క్రిస్టియన్ మైనారిటీల నుంచి 2,689 దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం మండల స్థాయిలో దాదాపు 70 శాతం దరఖాస్తుల పరిశీలన పూర్తయింది.
మే నెలాఖరులో తుది జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. అర్హుల ఎంపికకు దరఖాస్తులను బ్యాంకులకు పంపించనున్నారు. తుది జాబితా తయారైన తర్వాత కలెక్టర్లు ప్రభుత్వానికి అందజేస్తారు. జూన్ 2న ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మొదటి విడతలో 5 లక్షల మందికి రుణాలు మంజూరు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.