క్రైస్తవ మత ప్రచారకుడు, పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపుతోంది. రాజమండ్రి దివాన్ చెరువు – కొంతమూరు జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం స్థానికులు ప్రవీణ్ పగడాల మృతదేహాన్ని గుర్తించారు. పక్కనే బైక్ ఉండటంతో, రోడ్డు ప్రమాదంగా భావించారు. అయితే ఆయన శరీరంపై గాయాలు ఉండటంతో అనుచరులు, స్నేహితులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్కు చెందిన ప్రవీణ్ పగడాల రాజమండ్రికి ఎందుకు వెళ్లారు అనే విషయం ఇప్పటికీ తెలియలేదు. బైక్పై హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్నట్లు కొన్ని కథనాలు చెబుతున్నాయి. అయితే, వెనుక నుంచి ఢీకొట్టి లేదా దాడి చేసి ఉంటారని ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు.
క్రైస్తవ సంఘాలు, పాస్టర్లు, పలువురు రాజకీయ నాయకులు ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. మహాసేన రాజేష్, మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ వంటి నేతలు స్పందించారు. హర్ష కుమార్ మాట్లాడుతూ, ప్రవీణ్ బైక్ మీద తిరిగే పరిస్థితి లేదని, అతని మృతి అనుమానాస్పదంగా ఉందని అన్నారు.
ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఎయిర్పోర్టు నుంచి ఘటనాస్థలికి వరకూ సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. క్రైస్తవ సంఘాల నేతలు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన చేశారు. పోస్టుమార్టం ప్రక్రియను వీడియో రికార్డింగ్తో, అనుచిత పరిస్థితులు లేకుండా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని, సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నిజానిజాలు వెలుగులోకి తేవడమే లక్ష్యంగా ఉన్నట్లు తెలిపారు. ప్రవీణ్ పగడాల మృతి వాస్తవంగా రోడ్డు ప్రమాదమా? లేక కుట్రా? అనే విషయంపై పూర్తి విచారణ అనంతరం స్పష్టత వస్తుందని అధికారులు వెల్లడించారు.















