పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి కేసుపై తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తాజా ప్రకటన చేశారు. మంగళగిరి ఏపీ డీజీపీ కార్యాలయం నుంచి వచ్చిన ఫోరెన్సిక్ నిపుణుల బృందం నేరస్థలం వద్ద పరిశీలన జరిపిందని తెలిపారు. డీఎస్పీ ఆధ్వర్యంలో పారదర్శక దర్యాప్తు కొనసాగుతోందని, ఐదు ప్రత్యేక బృందాలు హైదరాబాదు నుంచి రాజమహేంద్రవరానికి మధ్య అనుసంధానంగా పనిచేస్తున్నాయని చెప్పారు.

హైదరాబాద్లో పగడాల ప్రవీణ్ కుటుంబ సభ్యులను విచారించి వాంగ్మూలం నమోదు చేసినట్టు తెలిపారు. ఈ కేసుపై సీఎం చంద్రబాబు పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారని, వదంతులు, మతపరమైన ప్రచారాలను ఆపాలని హెచ్చరించారు. ప్రవీణ్ మృతి హత్యా? ప్రమాదమా? అనేదానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, మత ఘర్షణలు తలెత్తకుండా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు.














