పాక్ మళ్లీ భారత సరిహద్దులపై దాడులకు పాల్పడిన నేపథ్యంలో భారత్ కూడా తీవ్ర ప్రతిదాడికి దిగింది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ వెల్లడించిన వివరాల ప్రకారం, భారత వైమానిక దళాలు చక్లాలా, మురిద్, రఫీకి, రహీమ్ యార్ ఖాన్ వంటి కీలక పాకిస్తాన్ ఎయిర్ బేస్లపై సమర్థవంతమైన దాడులు చేశాయి. ఈ దాడులతో పాక్ వైమానిక స్థావరాల్లో భారీ నష్టం సంభవించింది.

అదే సమయంలో పాకిస్తాన్ రాజౌరిలో షెల్ దాడి చేయగా, అదనపు జిల్లా అభివృద్ధి కమిషనర్ రాజ్ కుమార్ థాపా ప్రాణాలు కోల్పోయారు. పౌరుల ప్రాణాలు పోవడమే కాక, ఆస్తి నష్టం కూడా సంభవించింది. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషి ఈ దాడులపై వివరాలు వెల్లడించారు.
భారత వైమానిక దళం సియాల్కోట్, సుక్కూర్, చునియా, పస్రూర్ ప్రాంతాల్లోని పాక్ సైనిక స్థావరాలు, రాడార్ సైట్లు, విమానయాన కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది. పాకిస్తాన్ మన పౌర ప్రాంతాలు, సైనిక స్థావరాలపై మానవరహిత డ్రోన్లు, క్షిపణులు, ఫైటర్ జెట్లను వినియోగించిందని, భారత వాయుసేన వాటిని అడ్డుకున్నప్పటికీ, ఉధంపూర్, పఠాన్కోట్, అడంపూర్, భుజ్ స్టేషన్లకు కొన్ని నష్టం వాటిల్లిందని తెలిపారు.
పాకిస్తాన్ భారత్లో ఎయిర్ బేస్లను ధ్వంసం చేసిందని సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేస్తోందని కేంద్రం ఖండించింది. ఫేక్ ఫొటోలు ప్రచారంలో ఉన్నాయని స్పష్టం చేశారు.