టాలీవుడ్ ప్రముఖ నటి మంచు లక్ష్మి ఇండిగో విమానాయాన సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె సోషల్ మీడియా వేదికగా, ఇండిగో సిబ్బంది తనతో దురుసుగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయం గురించి ట్వీట్ చేసిన మంచు లక్ష్మి, తన పోస్టులకు ఇండిగో ఎయిర్ లైన్స్ను కూడా ట్యాగ్ చేసింది.
ఆమె పేర్కొన్నది, “నా లగేజ్ బ్యాగేజ్ను పక్కకు తోసేశారు. కనీసం నా బ్యాగ్ను ఓపెన్ చేసేందుకు కూడా పర్మిషన్ ఇవ్వలేదు. వాళ్లు చెప్పింది వినకపోతే నా బ్యాగును గోవాలోనే వదిలేస్తామన్నారు. ఇది చాలా దారుణం. ఇండిగో సిబ్బంది చాలా దురుసుగా ప్రవర్తించారు. ఇంకా పచ్చి నిజం మాట్లాడుకోవాలంటేవేధించారు. చివరకు నా లగేజీకి సెక్యూరిటీ ట్యాగ్ కూడా వేయలేదు. ఒకవేళ అందులో ఏదైనా వస్తువు మిస్ అయితే సంస్థ బాధ్యత తీసుకుంటుందా? ఇంత నిర్లక్ష్యంగా ఎయిర్లైన్స్ను ఎలా నడపగలుగుతున్నారు?” అంటూ వరుస ట్వీట్స్ చేసింది.

మంచు లక్ష్మి తన పోస్టుల్లో, తన బ్యాగుకు కనీసం లాక్ వేయలేదని, ట్యాగ్ కూడా వేయలేదని వీడియోలు షేర్ చేసింది. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఈ పోస్టులు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇండిగో విమానాయాన సంస్థ ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తుందో చూడాలి.
మంచు లక్ష్మి, కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు వారసురాలిగా టాలీవుడ్లోకి అడుగు పెట్టింది. నటిగా, సింగర్గా, నిర్మాతగా, యాంకర్గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఆమె, ఇటీవల వరుస సినిమాల్లో పాల్గొనడం తగ్గించి, తన నివాసాన్ని ముంబైలో షిఫ్ట్ చేసుకుంది. కానీ తన సామాజిక సేవా కార్యక్రమాల కోసం తరచూ హైదరాబాద్ వస్తూ ఉంటారు.