మహిళల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే క్యాన్సర్లను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ను ఐదు నుంచి ఆరు నెలల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం ఆయుష్ సహాయ మంత్రి ప్రతాప్ రావ్ జాధవ్ మంగళవారం (ఫిబ్రవరి 18) వెల్లడించారు. ఈ వ్యాక్సిన్ 9 నుంచి 16 సంవత్సరాల వయస్సు గల బాలికలకు అందించనున్నట్లు పేర్కొన్నారు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

క్యాన్సర్ వ్యాక్సిన్కు సంబంధించిన పరిశోధనలు దాదాపు పూర్తయ్యాయని, ప్రస్తుతం ట్రయల్స్ కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. దేశంలో క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా 30 ఏళ్ల పైబడిన మహిళలకు ఆసుపత్రుల్లో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే, ముందస్తుగా క్యాన్సర్ను గుర్తించేందుకు డేకేర్ క్యాన్సర్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత రొమ్ము క్యాన్సర్, నోటి క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్లను నియంత్రించేందుకు అవకాశం ఉంటుందని మంత్రి వివరించారు. క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే మందులపై కస్టమ్స్ సుంకాన్ని కూడా ప్రభుత్వం మాఫీ చేసిందని ఆయన తెలిపారు.
ప్రస్తుతం ఉన్న ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను ఆయుష్ సౌకర్యాలుగా మార్చే విషయంపై ప్రశ్నించగా, ఇప్పటికే ఆసుపత్రుల్లో ఆయుష్ విభాగాలను ఏర్పాటు చేశామని, ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవచ్చని మంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా 12,500 ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని, త్వరలో వీటి సంఖ్య మరింత పెంచనున్నట్లు తెలిపారు.