తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరీ గురించి తెలియని వారు అరుదు. గతంలో ఆమె పలు ఆలయాలను సందర్శించి వివాదాస్పద చర్యలు చేపట్టి వార్తల్లో నిలిచింది. అయితే, కొంతకాలంగా ఆమె పెద్దగా కనిపించకపోవడంతో మరింత ఆసక్తికరమైన పరిణామాలు వెలుగులోకి వస్తున్నాయి.
తాజాగా, గుంటూరు జిల్లా మంగళగిరిలో ఒక బిటెక్ విద్యార్థిని అఘోరీగా మారేందుకు ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన కలకలం రేపుతోంది. ప్రియదర్శిని కాలేజీలో బిటెక్ చదువుతున్న ఈ యువతి, కొద్దిరోజుల కిందట మంగళగిరికి వచ్చిన లేడీ అఘోరీతో పరిచయం ఏర్పరచుకుంది. ఆ పరిచయం క్రమంగా సాన్నిహిత్యంగా మారింది.

ఈ క్రమంలో, అఘోరీ కొన్ని రోజులు విద్యార్థిని ఇంటిలో బస చేయగా, వారి మధ్య బంధం మరింత బలపడింది. రెండ్రోజుల క్రితం 18 ఏళ్ల ఈ యువతి, తాను అఘోరీగా మారతానని నిర్ణయించుకుని, హైదరాబాద్ వెళుతున్నట్లు పోలీసులకు సమాచారం ఇచ్చింది. తల్లిదండ్రులకు ఇది ఇష్టం లేదని, అందుకే ఇల్లు వదిలి వెళ్లిపోతున్నట్లు తెలిపింది.
అయితే, సోమవారం యువతి తండ్రి కోటయ్య పోలీసులను ఆశ్రయించి తన కుమార్తె అదృశ్యమైందని ఫిర్యాదు చేశాడు. అయితే, ఆమె ముందుగానే పోలీసులకు సమాచారం ఇచ్చిన కారణంగా, వారు ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపారు. అయితే, తమ కూతురు లేడీ అఘోరీ వశపడ్డిందని, ఆమె మత్తుమందుల వలన మాయమైందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
తమ కుమార్తెను అఘోరీ కిడ్నాప్ చేసిందని ఆరోపిస్తూ, ఆమెను వెంటనే తమ వద్దకు తీసుకురావాలని తల్లిదండ్రులు పోలీసులను వేడుకుంటున్నారు. ఈ ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.














