ఐపీఎల్ అంటే ఫ్యాన్స్కి మోజు మాత్రమే కాదు, యజమానులకు పెద్ద పెట్టుబడి గేమ్. జట్టును గెలిపించేందుకు ఫ్రాంచైజీలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంటాయి. అలానే సన్రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ కూడా జట్టులో నమ్మకమైన ఆటగాళ్ల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు. కానీ ఆ పెట్టుబడి ఇప్పుడు నష్టంగా మారిందన్న చర్చ జోరుగా నడుస్తోంది.

ఈ సీజన్కి ముందు SRH గత సీజన్లో ఫైనల్కి చేరింది. టీమ్ ప్రదర్శనపై అభిమానులు, యాజమాన్యం భయాందోళనలతో పాటు ఆశలు కూడా పెట్టుకున్నారు. ముఖ్యంగా జట్టు బ్యాటింగ్ లైనప్ మీదే ఎక్కువ నమ్మకం ఉండింది. అందుకే, SRH యాజమాన్యం మూడు స్టార్ ఆటగాళ్లను భారీ మొత్తానికి కొనుగోలు చేసింది.

ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మను చెరో రూ.14 కోట్లకు రిటైన్ చేయగా, వికెట్ కీపర్ బ్యాట్స్మన్ ఇషాన్ కిషన్ను వేలంలో రూ.11.25 కోట్లకు దక్కించుకుంది. మొత్తం కలిపితే రూ.39.25 కోట్లు ఖర్చు అయింది. కానీ మొదటి మ్యాచ్ మినహా, ఈ ముగ్గురు ఆటగాళ్లు ఆ తర్వాతి నాలుగు మ్యాచ్ల్లో పూర్తిగా విఫలమయ్యారు.
ప్రథమ మ్యాచ్లో SRH 286 పరుగుల భారీ స్కోరు చేయడంలో హెడ్ (67), ఇషాన్ (106), అభిషేక్ (24) కీలక పాత్ర పోషించారు. కానీ ఆ మ్యాచ తర్వాత హెడ్ కేవలం 81 పరుగులు, అభిషేక్ 27 పరుగులు, ఇషాన్ కిషన్ 21 పరుగులు మాత్రమే చేశారు. ఈ వరుస ఫెయిల్యూర్స్తో జట్టు బ్యాటింగ్ యూనిట్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ ముగ్గురిపై పెట్టిన భారీ డబ్బు వృథా అయిందని అభిమానులు తీవ్రంగా నిరాశ చెందుతున్నారు. కావ్య మారన్ పెట్టుబడికి లాభం లేనట్టే కనిపిస్తోంది. టోర్నీలో మిగిలిన మ్యాచ్లలో వీరు ఫామ్లోకి వస్తే తప్ప, SRH ఫైనల్ ఆశలు సుదూరమేనని విశ్లేషకులు అంటున్నారు.