కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్సీయూ విద్యార్థులపై నమోదైన కేసులను వెనక్కి తీసుకుంటున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులకు ఊరట లభించింది. మరోవైపు, AI ఆధారంగా తప్పుడు వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆయన కంచ గచ్చిబౌలి భూములపై తప్పుడు సమాచారంతో కూడిన వీడియోలు పోస్ట్ చేశారని నోటీసుల్లో పేర్కొన్నారు. విచారణ కోసం ఆయనను ఈ నెల 9, 10, 11 తేదీల్లో హాజరు కావాలని సూచించారు.

AI వీడియోలు వైరల్ కావడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న ఖాతాలను గుర్తిస్తూ మరికొంతమందికి కూడా త్వరలో నోటీసులు జారీ చేయనున్నారు. ఇదిలా ఉండగా, ఈ వివాదంపై ఏర్పాటైన మంత్రుల కమిటీ సమావేశమైంది. ఇందులో యూనివర్శిటీ టీచర్స్ అసోసియేషన్, సివిల్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. వారు విద్యార్థులపై కేసుల ఉపసంహరణ, నిషేదాజ్ఞల రద్దు, పోలీసు బలగాల ఉపసంహరణ లాంటి అంశాలను ప్రస్తావించారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ విజ్ఞప్తుల మేరకు చర్యలు ప్రారంభించారు. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న ఇద్దరు విద్యార్థులపై కేసులు కూడా ఉపసంహరించేందుకు ఆదేశాలు జారీచేశారు. అలాగే హెచ్సీయూ క్యాంపస్ నుంచి పోలీసు బలగాలను వెనక్కి పంపించాలని వీసీకి లేఖ రాశారు.
ఇక కంచ గచ్చిబౌలి భూములపై ఉన్న హైకోర్టు విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది. సుప్రీంకోర్టులో కేసు నడుస్తుండటంతో 24 లోపు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు సూచించింది. ప్రభుత్వ న్యాయవాదులు ఫేక్ వీడియోలు, అటవీ ప్రాంతాల తగలబడిన ఘటనలపై వివరాలతో కూడిన కౌంటర్ను హైకోర్టులో దాఖలు చేయనున్నారు.