భారత మహిళల అండర్-19 క్రికెట్ జట్టు వరుసగా రెండుసార్లు ప్రపంచకప్ గెలిచింది. ఈ విజయాల్లో తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష కీలక పాత్ర పోషించింది. 2023లో జరిగిన అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్లో నిలకడగా ఆడిన త్రిష, ఈసారి కూడా మెరుపులు మెరిపించింది.

భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. అండర్-19 మహిళల క్రికెట్ జట్టు ఫైనల్లో దక్షిణాఫ్రికాను 9 వికెట్ల తేడాతో ఓడించి, టీ20 ప్రపంచకప్ టైటిల్ను వరుసగా రెండోసారి గెలుచుకుంది. మొదటి ఎడిషన్ 2023లో జరిగింది. షెఫాలీ వర్మ కెప్టెన్సీలో భారత జట్టు ఛాంపియన్గా నిలిచింది.
ఇప్పుడు వరుసగా రెండోసారి భారత్ ఈ ట్రోఫీని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఈ రెండు అద్భుత విజయాల్లో తెలంగాణలోని భద్రాచలం ప్రాంతానికి చెందిన గొంగడి త్రిష కీలక పాత్ర పోషించింది. 2023 ప్రపంచకప్ టోర్నీలో ఏడు మ్యాచ్లు ఆడిన త్రిష 23.20 సగటుతో 116 పరుగులు సాధించింది. ఫైనల్లోనూ 24 పరుగులు చేసి, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది.
ఈ టోర్నీలోనూ ఆమె టాప్ స్కోరర్గా నిలిచింది. ఏడు మ్యాచుల్లో 77 సగటుతో మొత్తం 309 పరుగులు సాధించి, తన స్పిన్ బౌలింగ్తో ఏడు వికెట్లు పడగొట్టింది. ఫైనల్ మ్యాచ్లోనూ మూడు వికెట్లు పడగొట్టింది. బ్యాటింగ్లోనూ 44 పరుగులతో నాటౌట్గా నిలిచింది. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు ఈ తెలంగాణ అమ్మాయికే వచ్చాయి.
మ్యాచ్ తర్వాత త్రిష మాట్లాడుతూ, మిథాలి రాజ్ తనకు రోల్ మోడల్ అని పేర్కొన్నారు. తనకు సహకరించిన టీమ్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, తండ్రికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మరియు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డులను అంకితమిస్తున్నానని తెలిపారు.
కూతురు కల కోసం ఉద్యోగం, సొంతూరును వదిలి..
భారత జట్టు విజయంతో త్రిష ఫ్యామిలీ సంబరాలు చేసుకుంటోంది. తమ బిడ్డ రాణించడమే కాకుండా భారత జట్టుకు విజయాన్ని అందించిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తన కుమార్తెను ఏదో ఒక స్పోర్ట్లో రాణించేలా ప్రోత్సహించాలని భావించిన రామిరెడ్డి తొలుత టెన్నిస్, బ్యాడ్మింటన్ లాంటి ఆటలు ఆడేలా త్రిషను ప్రోత్సాహించారు. కానీ, కూతురు సత్తా, ఉత్సాహం చూసి… తను క్రికెట్కు బాగా సరిపోతుందని గుర్తించారు.
త్రిషకు రెండున్నరేళ్ల వయసులో ప్లాస్టిక్ బాల్, బ్యాట్తో ఆయనే శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు. ఐదేళ్ల వయసు వచ్చిన తరువాత తనతోపాటు గ్రౌండ్కు తీసుకెళ్లి, రోజుకు మూడొందల బంతులను త్రిషకు వేసేవారు. ఆ తర్వాత సిమెంట్ పిచ్ను ఏర్పాటు చేసి త్రిషతో ప్రాక్టీస్ చేయించేవారు.
భద్రాచలం నుండి హైదరాబాద్కు షిఫ్ట్ అయిన రెండేళ్ల లోపే, త్రిష హైదరాబాద్ అండర్-16 జట్టుకు ఆడింది. ఆ తర్వాతి ఏడాదే అండర్-19, అండర్-23 జట్లకు ప్రాతినిధ్యం వహించింది. అటుపై అండర్-19 ఛాలెంజర్ ట్రోఫీలో ఆడే అవకాశం కూడా త్రిషకు లభించింది.