ఏప్రిల్ 18: భారతీయ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ఇంతకు ముందు ఎంబీబీఎస్ పాఠ్యాంశాలను స్థానిక భాషల్లో ప్రవేశపెట్టిన కేంద్రం, ఇప్పుడు ఇంజినీరింగ్ విద్యను కూడా ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తీసుకురావడంపై దృష్టి పెట్టింది.

ఈ దిశగా, అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (AICTE) అనేక ప్రాంతీయ భాషల్లో డిప్లొమా, డిగ్రీ కోర్సుల పుస్తకాలను రూపొందిస్తోంది. ఇప్పటికే మొదటి, రెండవ సంవత్సరాల కోసం 600 పైగా పాఠ్యపుస్తకాలను హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మరాఠీ, మలయాళం, గుజరాతీ తదితర 12 భాషల్లో రూపొందించి అప్లోడ్ చేసింది. మూడవ, నాల్గవ సంవత్సరాల పుస్తకాల రూపకల్పన కొనసాగుతోంది.
AICTE చైర్మన్ టీజీ సీతారాం వెల్లడించిన వివరాల ప్రకారం, 2026 డిసెంబర్ నాటికి 12 ప్రాంతీయ భాషల్లో పూర్తి స్థాయిలో ఇంజినీరింగ్ విద్యను అందించేందుకు ఏర్పాట్లు పూర్తవుతాయి. ఇది భాషా అవరోధంతో ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు ఎంతో ఉపయోగపడనుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 18 కళాశాలల్లో 1140 సీట్లకు అనుమతి లభించింది.
కృత్రిమ మేధ సాయంతో పుస్తకాలను వేగంగా తర్జుమా చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల మాతృభాషలో పాఠాలు అందించాలన్న సంకల్పంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇదంతా గ్రామీణ విద్యార్థులకు ఒక గొప్ప అవకాశంగా మారనుంది.