చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి ఘటన కలకలం
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్పై దాడి ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై రంగరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తన ఇంట్లో ఉన్న సమయంలో 20 మంది వ్యక్తులు తనపై దాడి చేశారని రంగరాజన్ మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు. ఈ దాడిలో పాల్గొన్నవారిలో వీర రాఘవ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొందరి కోసం గాలింపు కొనసాగుతోంది.

రామరాజ్యం కోసం సైన్యాన్ని తయారు చేయాలని ఒత్తిడి
రంగరాజన్పై దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన ఇంటికి వచ్చిన వ్యక్తులు “రామరాజ్యం కోసం సైన్యాన్ని తయారు చేయాలని” తనను ఒత్తిడి చేశారని రంగరాజన్ వెల్లడించారు. అయితే, ఇందుకు తన సహకారం అందించనని చెప్పినందుకు వారు తనపై దాడి చేసినట్లు ఆయన తెలిపారు.
తాను రాజ్యాంగబద్ధంగా ముందుకు వెళ్తానని, ఎవరి ఒత్తిడికి కూడా లోనుకానని స్పష్టం చేసినందుకు దాడి జరిగినట్లు రంగరాజన్ పోలీసులకు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
రంగరాజన్ను తమ సంస్థలో చేరాలని బెదిరింపులు
ఈ దాడి ఘటన శుక్రవారం జరిగింది. “రామరాజ్యం సంస్థ” కు చెందిన కొంతమంది వ్యక్తులు రంగరాజన్ను బెదిరించి, ఆలయ బాధ్యతలను వదిలి తమ సంస్థలో చేరాలని ఒత్తిడి చేశారని సమాచారం. ఈ విషయంపై రంగరాజన్ తండ్రి కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ నెల 7వ తేదీన ఈ దాడి జరగ్గా, ఇది రెండు రోజుల తర్వాత బయటకు రావడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ x లో స్పందించారు. “ధర్మరక్షకులపై దాడులు జరుగుతాయి… రాజ్యాంగ రక్షకులు చూస్తూ కూర్చుంటారు” అంటూ కామెంట్ చేశారు. దాడికి సంబంధించిన వీడియోలు ఉన్నా, హోం మంత్రి, ముఖ్యమంత్రి ఎందుకు మౌనం పాటిస్తున్నారని ప్రశ్నించారు. ఈ ఘటనపై హిందూ ధర్మ పరిరక్షకులు స్పందించకపోవడంపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన అర్చకుడు రంగరాజన్పై దాడి జరగడంతో భక్తులు, హిందూ సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దాడిని అందరూ ఖండిస్తున్నారు. దాడికి పాల్పడ్డ వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తుండగా, నిందితుల అరెస్టు కోసం ప్రత్యేక బృందాలు ముమ్మరంగా పని చేస్తున్నాయి.