ఇవాళ్టి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొననున్నట్లు ప్రకటించడంతో రాజకీయ వాతావరణం ఆసక్తికరంగా మారింది. వైసీపీ, తమకు అధికారిక ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
సోమవారం అసెంబ్లీ ప్రారంభ సమావేశాల్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం అసెంబ్లీ మరుసటి రోజుకు వాయిదా పడనుంది. తరువాత బీఏసీ సమావేశంలో అసెంబ్లీ ఎంత కాలం కొనసాగించాలి, ఏ అంశాలపై చర్చించాలనే విషయాలు ఖరారవుతాయి. సమావేశాలు సుమారు రెండు లేదా మూడు వారాలపాటు కొనసాగే అవకాశం ఉంది.

వైసీపీ ప్రతిపక్ష హోదా కోసం పట్టుదల
ఈ సమావేశాలకు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరుకానున్నారు. తమ పార్టీనే అసలైన ప్రతిపక్షంగా ఉంది కాబట్టి, తమకు అధికారిక ప్రతిపక్ష హోదా కల్పించాల్సిందేనని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వైసీపీ, ఇప్పటివరకు స్పీకర్ నుంచి సరైన స్పందన రాలేదని ఆరోపిస్తోంది. ప్రభుత్వ కూటమి జగన్కు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అవమానిస్తోందని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకు అసెంబ్లీకి హాజరయ్యే నిర్ణయం తీసుకున్నామని వైసీపీ నేతలు స్పష్టం చేశారు.

అసెంబ్లీ భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు మరింత కఠినతరం చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో పాసులు ఉన్నవారికి మాత్రమే ప్రవేశం కల్పించనున్నారు. మండలి ఛైర్మన్, స్పీకర్, ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి మాత్రమే గేట్ 1 నుంచి ప్రవేశించగలరు. గేట్ 2 నుంచి మంత్రులకు, గేట్ 4 ద్వారా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అనుమతి ఇవ్వనున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో ప్రదర్శనలు, ధర్నాలు, సమావేశాలు పూర్తిగా నిషేధించారు.
వైసీపీ నేతలు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఈ కఠిన నిబంధనలన్నీ వైఎస్ జగన్ను లక్ష్యంగా చేసుకునే అమలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలు ఆసక్తికరంగా మారనున్నాయి.