అమరావతి, మార్చి 21: ఏఐ ఆధారిత మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ 2.0 వెర్షన్ను జూన్ 30 నుంచి అందుబాటులోకి తీసుకొస్తామని, దీని ద్వారా వాయిస్ సేవలు అందించనున్నట్లు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.
టెన్త్, ఇంటర్ విద్యార్థులు ఇంటి నుంచే మొబైల్ ద్వారా హాల్టికెట్లు పొందే సౌకర్యాన్ని కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. అలాగే, పబ్లిక్ పరీక్షా ఫలితాలు వెలువడిన వెంటనే వాటిని విద్యార్థుల మొబైల్ నంబర్లకు నేరుగా పంపించే విధంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

ఏఐ ఆధారిత వాయిస్ సేవల ద్వారా “బస్ టికెట్ కావాలి” అని నోటితో చెప్పిన వెంటనే టికెట్ బుక్ చేయబడుతుందని, కరెంటు బిల్లు నంబర్ చెబితే అది చెల్లించబడుతుందని తెలిపారు. ఈ సేవలను అన్ని భాషల్లో అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి వివరించారు.
తిరుమల తిరుపతి దేవస్థాన సేవలు త్వరలో
రాబోయే 30 రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థాన సేవలను కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందుబాటులోకి తెస్తామని మంత్రి లోకేశ్ ప్రకటించారు. సర్టిఫికెట్లు ప్రతి ఆరు నెలలకు తీసుకోవాల్సిన అవసరం లేకుండా శాశ్వత ధ్రువీకరణ పత్రాలు చెల్లుబాటయ్యేలా త్వరలో చట్ట సవరణ చేయనున్నట్లు వెల్లడించారు.
ఏపీపీఎస్సీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రాథమిక కీ విడుదల
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ స్క్రీనింగ్ పరీక్ష ప్రాథమిక కీ విడుదల చేసింది. ఈ కీపై మార్చి 21 నుంచి 23 వరకు అభ్యంతరాలను ఆన్లైన్ ద్వారా స్వీకరించనున్నారు. మార్చి 16న నిర్వహించిన ఈ పరీక్షకు 7,620 మంది హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్ అటవీశాఖలో 37 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం ఈ నియామక ప్రక్రియ చేపట్టారు.
తెలంగాణ విదేశీ విద్య దరఖాస్తులు ప్రారంభం
విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద 2025-26 విద్యా సంవత్సరానికి అర్హులైన ఎస్సీ విద్యార్థులు మార్చి 20 నుంచి మే 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ దరఖాస్తు ప్రక్రియ ఈ-పాస్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని, చివరి తేదీకి వేచి చూడకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ సంక్షేమశాఖ సూచించింది.















