హైదరాబాద్ నగరం మరోసారి ఐటీ రంగంలో తన హవాను చాటుకుంది. నానక్రామ్గూడలో సోనాటా సాఫ్ట్వేర్ సంస్థ కొత్తగా ఏర్పాటు చేసిన ఫెసిలిటీ సెంటర్ను సీఎం రేవంత్ రెడ్డి మే 12న అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ ఇప్పుడు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (GCC), AI-రెడీ డేటా సెంటర్లు, మరియు తయారీ రంగాల్లో గ్లోబల్ హబ్గా మారిందన్నారు. సోనాటా సంస్థ ఆధునిక ఎల్గోరిథంలతో పర్యావరణ అనుకూలమైన పరిష్కారాలను అందిస్తున్నదని, ఇది రాష్ట్రానికి గర్వకారణమని కొనియాడారు.

తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్, విప్రో, HCL లాంటి దిగ్గజాలు తమ క్యాంపస్లను విస్తరించాయి. ప్రస్తుతం తెలంగాణలో రూ.3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని, లక్షకు పైగా నూతన ఉద్యోగాలు కల్పించామన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు, మహిళలు, యువత కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు.
2025 దావోస్ పర్యటన ద్వారా రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులను రాబట్టినట్లు తెలిపారు. పోలీసింగ్, శాంతిభద్రతలు, పన్నుల వసూళ్లు, ద్రవ్యోల్బణ నియంత్రణలోనూ తెలంగాణ రాష్ట్రం దేశంలో ముందంజలో ఉందన్నారు. ట్రాన్స్జెండర్ వలంటీర్లను ట్రాఫిక్ ఫోర్స్లో నియమించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని చెప్పారు.
ఇక ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న మిస్ వరల్డ్ 2025 పోటీలు హైదరాబాద్లో జరగడం గర్వకారణమన్నారు. ఇలాంటి మరిన్ని గ్లోబల్ ఈవెంట్లను రాష్ట్రంలో నిర్వహించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని తెలిపారు. తెలంగాణ రైజింగ్ వ్యూహం ద్వారా రాష్ట్రాన్ని వన్ ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని, యువత హైదరాబాద్కు బ్రాండ్ అంబాసిడర్లుగా మారి ప్రపంచానికి మన విజయాలను తెలియజేయాలని పిలుపునిచ్చారు.