ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం చేపట్టిన ప్రతీకార చర్య దేశ చరిత్రలో గర్వకారణంగా నిలిచింది. పహల్గామ్లో జరిగిన హేయమైన ఉగ్రదాడికి ఘాటుగా ప్రతిస్పందించిన భారత్, తన సైనిక బలాన్ని ప్రదర్శిస్తూ పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) ప్రాంతాల్లోని తొమ్మిది కీలక ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో బహవల్పూర్లోని జైష్-ఎ-మొహమ్మద్ ప్రధాన స్థావరం, మురిడ్కేలోని లష్కరే తోయిబా స్థావరాలు సహా అనేక ముఖ్య ఉగ్ర శిబిరాలు ధ్వంసమయ్యాయి. భారత సాయుధ దళాలు ప్రత్యేక శిక్షణ కలిగిన బృందాలతో ఈ దాడిని చేపట్టాయి. ఈ మిషన్లో సుమారు 100 మంది ఉగ్రవాదులు మట్టుబడ్డారని రిపోర్టులు చెబుతున్నాయి. పాక్లోని ఉగ్రవాద కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని సర్జికల్ దాడులకు సమానంగా భారత్ చేపట్టిన ఈ చర్యకు ‘ఆపరేషన్ సింధూర్’ అనే పేరును పెట్టారు.

ఈ ఆపరేషన్ సందర్భంగా భారత వైమానిక దళం, సైన్యం, నౌకాదళం సమన్వయంతో పనిచేసినట్లు తెలుస్తోంది. గుప్తచర సేవలు అందించిన RAW (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్), ఇంటెలిజెన్స్ బ్యూరో ఆధారంగా సుదీర్ఘ ప్రణాళికతో ఈ దాడి అమలు చేశారు. పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాద కేంద్రాల స్థితి గూర్చి ఖచ్చితమైన సమాచారం సేకరించిన తర్వాతే భారత సైన్యం ఈ దాడికి సిద్ధమైంది. పాక్ తీరుపై వేగంగా ప్రయాణించిన క్షిపణుల దాడులతో ఉగ్ర శిబిరాలు నేలమట్టం అయ్యాయి. ఈ దాడి సమయంలో పాక్ సైన్యానికి కూడా తీవ్ర నష్టం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.
దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రముఖులు, సామాన్య ప్రజలంతా ఈ ఆపరేషన్కు మద్దతుగా స్పందిస్తున్నారు. లోకసభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తన ట్వీట్లో “మన సాయుధ దళాలను చూసి గర్వంగా ఉంది. జై హింద్” అని పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ చేస్తూ “భారత సైన్యం ఉగ్రస్థావరాలపై చేసిన మెరుపుదాడులు గర్వపడేలా చేశాయి. మన సైన్యానికి ఎల్లప్పుడూ అండగా ఉంటాం. జై హింద్” అన్నారు. ఆపరేషన్ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాదులోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో అత్యవసర సమీక్ష నిర్వహిస్తున్నారు. అన్ని విభాగాల అధికారులతో సమావేశం జరిపి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఢిల్లీలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి కూడా ఫోన్ చేసి హైదరాబాదుకు రావాలని సూచించారు. సాయంత్రం మాక్ డ్రిల్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు.

ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో స్పందిస్తూ భారత సైన్యం ధైర్యాన్ని అభినందించారు. “జై హింద్” అంటూ తన పోస్ట్లో పేర్కొన్నారు. మంత్రి నారా లోకేష్ “జై హింద్… న్యాయం జరిగింది” అంటూ ట్వీట్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడికి భారత సైన్యం ఇచ్చిన ప్రతీకార దాడి న్యాయంగా జరుగిన చర్య అని అన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా “జీరో టోలరెన్స్ ఫర్ టెర్రరిజం… భారత్ మాతాకీ జై” అంటూ తన ట్వీట్లో పేర్కొన్నారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు సైన్యానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఈ దాడికి పాక్ తీవ్ర భయాందోళనలో పడింది. ఆ దేశ ప్రభుత్వం అంతర్జాతీయ సహాయానికి అమెరికా దగ్గరకు పరుగెత్తింది. అయితే భారత్ మాత్రం “మేము ఆత్మరక్షణలో భాగంగా దాడి చేశాం. ఉగ్రవాదాన్ని సహించేది లేదు” అనే స్పష్టమైన సంకేతాన్ని ప్రపంచానికి పంపింది. ఇదే సమయంలో సోషల్ మీడియాలో ఈ ఆపరేషన్కు మద్దతుగా పెద్ద ఎత్తున హ్యాష్ట్యాగ్లు ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా #OperationSindhoor, #IndiaStrikesBack, #IndiaPakistanWar వంటి ట్యాగ్లు Twitter, Instagram, Facebookలలో వైరల్ అవుతున్నాయి. భారతీయులు “జై హింద్”, “భారత్ మాతాకీ జై” అంటూ దేశభక్తిని వ్యక్తపరుస్తున్నారు.
ఈ దాడి భారత సైన్యం సాంకేతికంగా ఎంతగా అభివృద్ధి చెందిందో, ఉగ్రవాదంపై ఎంత ఖచ్చితంగా పనిచేస్తుందో ప్రపంచానికి తెలియజేసింది. అంతేకాక, ఈ ఆపరేషన్ దేశ భద్రతకు భారత ప్రభుత్వం, రాజకీయ నాయకులు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో స్పష్టంగా చూపించింది. ప్రతీకారం తీసుకునే స్థితి మనకు ఉందని, అవసరమైతే ఎక్కడైనా అణచివేయగల శక్తి మనకు ఉందని ఈ ఆపరేషన్ నిరూపించింది. ఉగ్రవాదాన్ని మట్టుబెట్టే దిశగా ఇది ఒక మైలురాయి అయ్యింది.