తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం అనిశ్చితంగా మారింది. ఒకవైపు ఎండలు మండిపోతుండగా, మరొకవైపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ ప్రకారం, వచ్చే నాలుగు రోజులు కూడా ఇటువంటి భిన్న పరిస్థితులు కొనసాగుతాయి. తెలంగాణలో మంగళవారం, బుధవారం పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు కొద్దిగా తక్కువగా నమోదయ్యే అవకాశముంది. ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్లో 42.3°C, హైదరాబాద్లో 37.1°C ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

తెలంగాణలో కొంతమేర తేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడొచ్చు. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనంతపురం తదితర జిల్లాల్లో వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. బుధవారం శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విజయనగరం జిల్లా కొందరు మండలాల్లో వడగాలులు ప్రభావం చూపించొచ్చు.
ఏపీలో సోమవారం వైఎస్సార్ జిల్లా సిద్ధవటం 41.1°C, ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం 41°C, నంద్యాల రుద్రవరం 40.6°C, తిరుపతి సూళ్లూరుపేటలో 40.5°C, విజయనగరం కొత్తవలస, నరసరావుపేటలో 40.3°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.












