జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో శాంతియుత క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. పీపుల్స్ ప్లాజా నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ, ట్యాంక్బండ్పై ఉన్న మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విగ్రహం వరకు కొనసాగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, పహల్గామ్లో అమాయక పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు.
1967, 1971లో జరిగిన దాడులకు ఇందిరాగాంధీ గట్టి జవాబు ఇచ్చినట్లు ఆయన గుర్తు చేశారు. ఆ సమయంలో పాకిస్తాన్ రెండు ముక్కలయ్యిందని చెప్పారు. ప్రధాని మోదీ దుర్గామాత భక్తి ఉన్న వ్యక్తిగా ఇందిరాగాంధీ నుంచి స్పూర్తి తీసుకోవాలని సూచించారు. ఉగ్రవాద మూకలకు గట్టి ప్రత్యుత్తరం ఇవ్వాలని, పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్లో కలపాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పిలుపుతో అన్ని రాష్ట్రాల్లో క్యాండిల్ ర్యాలీలు నిర్వహించగా, తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో భారీ ర్యాలీ జరిగింది. పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొని ఉగ్రదాడి మృతులకు నివాళులు అర్పించారు.