హైదరాబాద్, ఏప్రిల్ 17:
రాష్ట్రవ్యాప్తంగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించబడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రేడింగ్ విధానాన్ని తొలగించి మార్కుల ప్రకారమే ఫలితాలు ఇవ్వనున్నట్టు జీఓ జారీ చేసింది. జవాబుపత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 15తో ముగిసింది. ఫలితాలను రేపో మాపో విడుదల చేసే అవకాశం ఉంది. అయితే టెన్త్ మెమోలు ఎలా ముద్రించాలన్న అంశంపై విద్యాశాఖ ఇంకా తర్జనభర్జనలో ఉంది. దీనిపై స్పష్టత వచ్చిన తర్వాతే ఫలితాల విడుదలకు మార్గం సుగమమవుతుంది.

ఇప్పటి వరకు గ్రేడింగ్ విధానం ప్రకారం ఫలితాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు మళ్లీ మార్కుల ఆధారంగా ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అంటూ ముద్రించాలన్న ఆలోచనలో ఉంది. 35 శాతం కంటే తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు “ఫెయిల్” అని ముద్రించనుంది. ఈ నేపథ్యంలో అధికారులు ఫలితాల విడుదల ఆలస్యం కావొచ్చని భావిస్తున్నారు. మరోవైపు, మార్కుల విధానం వల్ల కార్పొరేట్ పాఠశాలలు దుర్వినియోగానికి పాల్పడతాయని, విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం గతంలో నవంబర్ 2024లోనే గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేసి, 20 మార్కులకు ఇంటర్నల్ మార్కులు కొనసాగిస్తామని తెలిపింది. అయితే ఇవి 2025-26 విద్యా సంవత్సరానికి తొలగించే అవకాశం ఉంది.