హైదరాబాద్, ఏప్రిల్ 17:
జేఈఈ మెయిన్ 2025 తుది విడత ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఈ రోజు (ఏప్రిల్ 17) విడుదల చేయనుంది. ఈ సంవత్సరం జనవరిలో మొదటి విడత పరీక్షలు నిర్వహించగా, ఏప్రిల్ 2 నుంచి 9వ తేదీ వరకు తుది విడత పరీక్షలు జరిగాయి. ఇందులో ఏప్రిల్ 2, 3, 4, 7, 8 తేదీల్లో బీఈ/బీటెక్కు సంబంధించిన పేపర్-1 పరీక్షలు జరిగాయి. అలాగే ఏప్రిల్ 9న బీఆర్క్/బీ ప్లానింగ్కు సంబంధించిన పేపర్ 2ఏ, 2బీ పరీక్షలు నిర్వహించారు.

ఈ రెండు విడతలలో విద్యార్థులు సాధించిన ఉత్తమ స్కోర్ను పరిగణనలోకి తీసుకొని ర్యాంకులు కేటాయించనున్నారు. ఇక ప్రాథమిక ఆన్సర్ కీపై అభ్యంతరాల గడువు ఏప్రిల్ 13 (ఆదివారం అర్ధరాత్రి)తో ముగియగా, వాటిని నిపుణుల కమిటీ పరిశీలించింది. ఈ నేపథ్యంలో తుది ఆన్సర్ కీతో పాటు ర్యాంకులను కూడా నేడు ప్రకటించనున్నారు.
కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులను ప్రకటిస్తారు. నిపుణుల అంచనాల ప్రకారం కటాఫ్ రేంజ్లు ఇలా ఉండొచ్చు:
- జనరల్ కేటగిరీ: 93%-95%
- ఓబీసీ/ఈడబ్ల్యూఎస్: 91%-93%
- ఎస్సీ కేటగిరీ: 82%-86%
- ఎస్టీ కేటగిరీ: 73%-80%
ఈ విడత ఫలితాలతో దేశవ్యాప్తంగా 2.50 లక్షల మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించనున్నట్లు ప్రకటిస్తారు. అంటే మే 18న జరగనున్న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు వీరే అర్హులు అవుతారు.
ఎన్టీఏ ఇప్పటికే స్పష్టత ఇచ్చింది – తుది ఆన్సర్ కీ వచ్చే వరకు ప్రొవిజినల్ కీలో ఉన్న సమాధానాల ఆధారంగా ఎటువంటి నిర్ణయం తీసుకోరాదని సూచించింది. ఎందుకంటే కొన్ని ప్రశ్నలపై విద్యార్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను నిపుణుల కమిటీ పరిగణనలోకి తీసుకొని తుది నిర్ణయం తీసుకుంటుంది. ఈ ప్రక్రియలో విద్యార్థులకు అదనంగా మార్కులు కలసే అవకాశముంది.
తుది కీతో పాటు ర్యాంకులనూ ఈరోజే విడుదల చేయనున్నందున విద్యార్థులు ఉత్కంఠగా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.