మామిడి పండు వేసవిలో అందరికీ ఎంతో ఇష్టమైనది. దీనిని పండుగా, పచ్చిగా, ఉడికించి తింటారు. అంతేకాదు, మామిడితో పలు రుచికరమైన పానీయాలు తయారవుతాయి. వాటిలో మామిడి షేక్ ప్రత్యేకం. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ దీనిని ఇష్టంగా తాగుతారు. పాలతో కలిపి చేసిన మామిడి షేక్ వేసవిలో శరీరానికి చల్లదనాన్ని, శక్తిని ఇస్తుంది.

మామిడిలో విటమిన్ A, C, E, K, B6, ఫైబర్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు, జీర్ణక్రియకు సహాయపడతాయి. మామిడి షేక్ వల్ల చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపర్చేందుకు కూడా ఇది సహకరిస్తుంది. వేసవిలో ఎక్కువ వేడి కారణంగా అలసట వస్తే మామిడి షేక్ తాగితే తక్షణ శక్తిని పొందొచ్చు.
అయితే దీన్ని ఎక్కువగా తీసుకుంటే హానికరం కావచ్చు. ముఖ్యంగా మధుమేహం ఉన్న వారు మామిడి షేక్ను తాగకుండా ఉండాలి, లేదా పరిమితంగా తాగాలి. ఇందులో సహజంగానే చక్కెర అధికంగా ఉండటంతో రక్తంలో షుగర్ స్థాయిలు పెరగవచ్చు. బరువు తగ్గాలనుకునే వారు కూడా తక్కువగా తీసుకోవాలి. మామిడి షేక్కు ఎక్కువగా చక్కెర కలిపితే ఇది మరింత హానికరం అవుతుంది.

ఢిల్లీ శ్రీ బాలాజీ యాక్షన్ మెడికల్ ఇన్స్టిట్యూట్ డైటీషియన్ ప్రియా పాలివాల్ మాట్లాడుతూ.. రోజుకు ఒక్కసారి చిన్న గ్లాసులో మాత్రమే తాగాలని సూచిస్తున్నారు. గ్యాస్, అసిడిటీ, కాలేయ సంబంధిత సమస్యలున్న వారు డాక్టర్ సలహాతో మాత్రమే మామిడి షేక్ తాగాలి.
అంతిమంగా, మామిడి షేక్ ఆరోగ్యానికి మంచిదే కానీ మితంగా తీసుకుంటేనే మేలు చేస్తుంది. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి, అవసరమైన పరిమితిలో మాత్రమే తీసుకోవడం ఉత్తమం.