ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో అగ్నిప్రమాదం కలకలం రేపింది. రెండో బ్లాక్లో బ్యాటరీలు నిల్వ ఉంచే ప్రాంతంలో మంటలు చెలరేగినట్లు సమాచారం. ఎస్పీఎఫ్ సిబ్బంది అప్రమత్తమై వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా, వారు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చేందుకు శ్రమించారు. ప్రమాదానికి గల కారణాలపై భద్రతా బృందం దర్యాప్తు ప్రారంభించింది.

ఈ రెండో బ్లాక్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్, టూరిజం మంత్రి కందుల దుర్గేష్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, హోం మంత్రి వంగలపూడి అనితల పేషీలు ఉన్నాయి. అయితే తెల్లవారుజామున ఈ ఘటన జరగడం వల్ల, ఆ సమయంలో కార్యాలయాల్లో సిబ్బంది లేరు.
ఈ నేపథ్యంలో హోం మంత్రి అనిత అధికారులను సంప్రదించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చినట్లు ఫైర్ శాఖ అధికారులు ఆమెకు తెలియజేశారు. ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు పూర్తి స్థాయిలో విచారణ జరపాలని సంబంధిత అధికారులకు ఆమె ఆదేశాలు జారీ చేశారు.
ఈ ఘటనపై ఇంకా అధికారిక సమాచారం వెల్లడవాల్సి ఉంది.














