హంగూ లేదు.. ఆర్భాటమూ లేదు. భుజానికి ఓ హ్యాండ్ బ్యాగ్, వీపున చిన్న లగేజీ బ్యాగ్… స్పెషల్ ఫ్లైట్ లేదు, కాన్వాయ్ లేదు, సెక్యూరిటీ అసలే లేదు. తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ సాధారణ కాంగ్రెస్ కార్యకర్తలా హైదరాబాద్లో ల్యాండ్ అయ్యారు. వచ్చిన వెంటనే తన విధానాన్ని స్పష్టంగా తెలియజేశారు. ఫ్లెక్సీలకు ఫోజులివ్వడం కాదు, ప్రజల్లో ఉంటూ నిజాయితీగా పనిచేయడం ముఖ్యం అని స్పష్టం చేశారు. పైరవీలు అవసరం లేదని, ఆ ఆలోచనే మైండ్ నుంచి తొలగించాలని హింట్ ఇచ్చారు. గ్రౌండ్ లెవెల్లో పనిచేసే వారికే పదవులు వస్తాయని క్లియర్గా చెప్పారు. వ్యక్తిగతంగా సాఫ్ట్గా కనిపించినా, పార్టీ పరంగా చాలా సీరియస్ అని తన తొలి ప్రసంగంతోనే చూపించారు.

హైదరాబాద్లో ల్యాండ్ అయిన వెంటనే పార్టీ వ్యవహారాలపై పూర్తిగా ఆరా తీశారు. పార్టీ నేతల మధ్య సమన్వయం లోపించినట్లు గుర్తించి, సీనియర్, జూనియర్ తేడా లేకుండా కలిసి పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. విభేదాలు, వివాదాలు సృష్టించేవారిపై కఠిన చర్యలు తప్పవని గట్టిగా హెచ్చరించారు. టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న మీనాక్షి నటరాజన్, పార్టీ కోసం కష్టపడ్డ ప్రతిఒక్కరినీ గుర్తిస్తామని స్పష్టం చేశారు.

ఇటు సీఎం రేవంత్ రెడ్డీ కూడా సమావేశంలో చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. నామినేటెడ్ పోస్టులు వచ్చిన వారు పార్టీకోసం పనిచేయడం లేదని, పోస్టులు రాని వారు పదవి రాలేదని పనిచేయడం మానేశారని ఫైర్ అయ్యారు. మంచి విషయాలను మంచి మైక్లో చెప్పాలి, చెడు విషయాలను చెడు చెవిలో చెప్పాలన్న ఆయన, కొందరు మాత్రం చెడు మైక్లో మంచి విషయాలు చెబుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యల వల్ల పార్టీకి ఇబ్బందులు వస్తాయని, అలాంటి వారిపై ఇక కఠినంగా ముందుకెళ్తామని తెలిపారు.
మొత్తంగా, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటిదాకా ఒక విధానం, ఇకపై మరొక విధానం ఉండబోతోందని నేతలు అంటున్నారు. కొత్త ఇన్చార్జ్ రాకతో పార్టీ భవిష్యత్తు ఎలా మారబోతోందో వేచిచూడాలి.