హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా పాలన- ప్రజా విజయోత్సవాలను ఉత్సాహభరితంగా జరుపుకొంటోంది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఈ ఏడాది పాలన ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. 2023 డిసెంబర్ 7వ తేదీన తెలంగాణలో సరికొత్త అధ్యాయం ఆరంభమైందని, అసలు సిసలైన ప్రజా పాలనకు తమ కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, ప్రజల కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నామని అన్నారు. తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు, త్యాగాలు జరిగాయన్నారు. వాటినన్నింటినీ వీలునామాగా రాసి 2023, డిసెంబర్ 7న తెలంగాణ తన చేతుల్లో పెట్టిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ముందుకు తీసుకువెళ్లే బాధ్యతను ఈ సమాజం తనకు అప్పగించిందని పేర్కొన్నారు.
ఆ క్షణం నుండి, జన సేవకుడిగా, ప్రజా సంక్షేమ శ్రామికుడిగా, జనహితమే పరమావధిగా, జాతి ఆత్మగౌరవమే ప్రాధాన్యతగా, విమర్శలను సహిస్తూ, విద్వేషాలను ఎదిరిస్తూ ప్రజాస్వామ్యానికి రెడ్ కార్పెట్ పరిచామన్నారు. ప్రపంచంలో అగ్ర భాగాన తెలంగాణను నిలిపడానికి అహర్నిశలు కృషి చేస్తోన్నామని రేవంత్ రెడ్డి అన్నారు. గొప్ప లక్ష్యాల వైపు నడుస్తూ, నాలుగు కోట్లమంది ఆశయాలను నెరవేరుస్తామన్నారు. విరామం ఎరుగక, ముందుకు సాగిపోతామని సీఎం పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రజా పాలనలో తనకు సంతృప్తి ఇచ్చిందని రేవంత్ రెడ్డి తెలిపారు.
కాగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పాలన- ప్రజా విజయోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ వేడుకలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 7,8,9 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ట్యాంక్బండ్పై ప్రత్యేక కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. సచివాలయంలో తెలంగాణ తల్లి భారీ విగ్రహాన్ని 9వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. అదే రోజున కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి, సోనియా గాంధీ జన్మదినం కావడం విశేషం.