తెలుగు చిత్రాల్లో హాస్య కథానాయకునిగా పేరుతెచ్చుకున్న రాజేంద్రప్రసాద్. తనదైన మార్క్ ను సృష్టించుకుని కామెడీని పరుగులు తీయించారు. రాజేంద్రప్రసాద్ తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన విషయాలను వెల్లడించారు.
తాను చిన్నప్పటి నుంచి నేను అల్లరివాడినని, చదువు పూర్తయిన తరువాత ఉద్యోగం చేయకుండా కొంతకాలం ఖాళీగా తిరిగానని అన్నారు. ‘ప్రేమించు పెళ్లాడు’ సినిమాతో దర్శకుడు వంశీ తనను హీరోను చేశారన్నారు. ఆ తరువాత ‘లేడీస్ టైలర్’తో హిట్ దక్కిందన్నారు. ఆ సినిమా తరువాత తాను వెనుదిరిగి చూసుకోలేదన్నారు. ఏడాదికి 12 సినిమాలు చేస్తూ వెళ్లానని, దానిని భగవంతుడు ఇచ్చిన అవకాశంగానే నేను భావించానని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
నాటి నిర్మాతలు .. దర్శకులు .. రచయితలు తన కోసం విభిన్నమైన పాత్రలను సృష్టించారన్నారు. అవి రెగ్యులర్ హీరోల పాత్రలు కాదని, సమాజంలో కనిపించే పాత్రలనే తెరపై చేశానన్నారు. ‘అప్పుల అప్పారావు’ .. ‘పేకాట పాపారావు’ అలాంటి చిత్రాలేనని అన్నారు. ఆ పాత్రలు అందరికీ కనెక్ట్ అయ్యాయన్నారు. చిన్న బడ్జెట్ లు … పెద్ద హిట్లు అన్నట్టుగా తన కెరియర్ కొనసాగిందని పేర్కొన్నారు. ప్రేక్షకులు తమ ఇంట్లో ఒకరిగా తనను భావించడం వల్లనే, తాను ఇంతకాలం పాటు నేను సినిమాలు చేయగలిగానని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.