సంధ్య థియేటర్ ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా 4వ తేదీన సంథ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతిచెందారు. దాంతో ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో అల్లు అర్జున్ను కూడా నిందితుడిగా చేర్చారు. అయితే, తనపై నమోదైన కేసును కొట్టివేయాలని అల్లు అర్జున్ ఇప్పటికే పిటీషన్ దాఖలు చేశారు. ఆకస్మాత్తుగా బన్నీ అరెస్ట్ చేయబడటంతో సినీ రంగం మరియు అభిమానులు షాక్కు గురయ్యారు.
సంధ్య థియేటర్ ఘటనలో మృతిచెందిన మహిళ గురించి ముందే అల్లు అర్జున్ స్పందించారు. రేవతి గారి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. “సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన గురించి విని షాక్ అయ్యాం. ఆ వార్తతో పుష్ప సెలబ్రేషన్స్లో యాక్టివ్గా పాల్గొనలేకపోయాం. మేము సినిమా తీసేదే జనాలు థియేటర్కు వచ్చి ఆనందం పొందాలి. రేవతి గారి కుటుంబానికి నా సంతాపం తెలియజేస్తున్నాను.
నా తరఫున బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు అందిస్తాను. అలాగే మా టీమ్ నుంచి ఇంకా ఎలాంటి సాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. వారికి నా వల్లైనంత సాయం చేస్తాను. త్వరలోనే రేవతి కుటుంబాన్ని స్వయంగా కలుస్తాను” అని అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా వీడియో ద్వారా భరోసా ఇచ్చారు.